తెలంగాణ సర్కార్ మాస్టర్ ప్లాన్.. గంటల వ్యవధిలోనే రూ.5080 కోట్ల పంచాయతీ నిధులు మాయం..!!

by Disha Web Desk 19 |
తెలంగాణ సర్కార్ మాస్టర్ ప్లాన్.. గంటల వ్యవధిలోనే రూ.5080 కోట్ల పంచాయతీ నిధులు మాయం..!!
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలోని పంచాయతీల్లో అధికారిక దొంగలు పడ్డారు. కేంద్రం నుంచి వచ్చిన నిధులను గంటల వ్యవధిలోనే దారి మళ్లించి మాయం చేశారు. పంచాయతీలకు ఇచ్చే నిధులను రాష్ట్ర ప్రభుత్వం డైవర్ట్​ చేస్తుందని, దీంతో పంచాయతీలు ఆర్థిక కష్టాల్లో కొట్టుమిట్టాడుతున్నాయని కేంద్రం వేసిన ఎత్తులకు రాష్ట్ర ప్రభుత్వం పై ఎత్తులు వేసింది. వచ్చిన నిధులను పంచాయతీలకు తెలియకుండానే మొత్తం లాగేసుకుంది. తీసుకున్న ఫండ్స్‌ను అడ్వాన్సు పేమెంట్ల కింద విద్యుత్తు సంస్థలకు మెజార్టీగా ఇచ్చింది. ఇంకా కొన్ని నిధులను ఇతర పథకాలకు వినియోగించుకునేందుకు సిద్ధమైంది.

నేరుగా ఇచ్చినా అంతే..

పంచాయతీల కోసం ఇచ్చే ఆర్థిక సంఘం నిధులను తెలంగాణ ప్రభుత్వం ఇతర పథకాలకు, స్కీంలకు వినియోగిస్తుందని కేంద్రం గుర్తించింది. ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి మార్చి వరకు చేసిన అడిట్‌లో ఈ విషయం తేలిపోయింది. దీంతో గ్రామాలకు నేరుగా నిధులు ఇవ్వాలని మార్పులు చేసింది. పీఎఫ్​ఎంఐసీ పేరుతో బ్యాంకుల్లో పంచాయతీల పేరుతో ప్రత్యేక ఖాతాను తీసింది. చెక్ పవర్​ఉండే సర్పంచ్, ఉప సర్పంచ్‌ల సంతకాలతో డిజిటిల్​కీ తయారు చేసింది. దీంతో ఈ ఖాతాలకు వేసిన సొమ్మును పంచాయతీ పాలకవర్గం మాత్రమే డ్రా చేస్తుందని కేంద్రం భావించింది. కానీ, తెలంగాణ ప్రభుత్వం మాస్టర్ ప్లాన్​ వేసింది. కేసీఆర్ సర్కారు ప్లాన్​కింద కేంద్రం తీసుకున్న చర్యలు ఉత్తిగానే తేలిపోయాయి. ప్రత్యేక ఖాతాల నుంచి కూడా నిధులను ప్రభుత్వం మళ్లించుకుంది.

తెలియకుండానే మళ్లింపు..

15వ ఆర్థిక సంఘం కింద కేంద్రం నుంచి రెండో విడుతలోని ఒక నెల వంతుగా రూ. 5వేల కోట్లను విడుదల చేసింది. ఈ నిధులను గ్రామ పంచాయతీల్లో అంతర్గత రోడ్లకు 50 శాతం, పంచాయతీ అభివృద్ధి, మెయింటనెన్స్​పనులకు 50శాతం వినియోగించుకోవాలని సూచించింది. వాస్తవంగా ఈ ఏడాది ఏప్రిల్​నుంచి కేంద్రం 15వ ఆర్థిక సంఘం నిధులను నిలిపివేసింది. పాత పనులకు సంబంధించిన యూసీలు రాకపోవడం, ఇచ్చే ఫండ్స్‌ను పంచాయతీలకు కాకుండా ఇతర పథకాలకు ప్రభుత్వం వినియోగిస్తుండటంతో విడుదల చేయకుండా వెనకాడింది. వీటిలో ఏప్రిల్​నెలకు సంబంధించిన వాటిని దాదాపుగా రూ. 5080 కోట్లు రాష్ట్రానికి రెండు రోజుల కిందట ఇచ్చింది. పంచాయతీల్లోని ప్రత్యేక ఖాతాల్లో ఈ నిధులు జమ అయ్యాయి. ఈ విషయం గుర్తించిన సర్కారు.. వెంటనే అప్రమత్తమైంది. పంచాయతీలకు సంబంధించిన డిజిటల్ కీలను ఎంపీఓలు, డీపీఓల దగ్గర భద్రపర్చిన ప్రభుత్వం.. సర్పంచ్‌లకు తెలియకుండానే డిజిటల్​కీ లతో నిధులను సర్కారు ఖాతాలకు మళ్లించింది.

ముందుగా 15వ ఆర్థిక సంఘం నిధులు జమ అయినట్లుగా సర్పంచ్‌లకు మెస్సేజ్​ వచ్చింది. ఒక్కో గ్రామానికి రూ. 50 వేల నుంచి రూ. 1.20 లక్షల వరకు జమ అయ్యాయి. ఇప్పటికే బిల్లులు రాక సతమతమవుతున్న సర్పంచ్‌లకు 15వ ఆర్థిక సంఘం నిధులు జమ కావడంతో కొంత ఆశలు మొలకెత్తాయి. గ్రామాల్లో కనీస అవసరాలను తీర్చే పనులు చేయాలని సంబురపడ్డారు. కానీ, పంచాయతీ పీఎఫ్​ఎంఐసీ ఖాతాల్లో జమ అయిన నిధులు కేవలం గంటల వ్యవధిలోనే మళ్లీ డ్రా అయ్యాయి. ఈ విషయం సర్పంచ్‌లకు అసలు తెలియలేదు. పంచాయతీ ఖాతాల నుంచి నిధులు మాయం అవుతుండటంతో.. ఎంపీఓలకు ఫోన్లు చేసి విషయం అడిగారు. ముందుగా తమకు తెలియదని సమాధానం చెప్పిన ఎంపీఓలు.. ఆ తర్వాత ఆసలు విషయం చెప్పారు. కేంద్రం ఇచ్చిన నిధులను ప్రభుత్వం తమ ఖాతాకు మళ్లించుకుందని, డిజిటల్ కీతో సర్పంచ్‌లు, ఉప సర్పంచ్‌లు, చెక్ పవర్​ఉన్న అధికారులకు తెలియకుండానే నిధులు తీసుకుందని స్పష్టమైంది.

అడ్వాన్సులు చెల్లింపు

ఆర్థిక సంఘం నిధులను తెలంగాణ ప్రభుత్వం మరోసారి మళ్లించింది. ఈ నిధుల నుంచి విద్యుత్​ బిల్లులు చెల్లించాలని నిబంధనల్లో లేదు. అంతేకాకుండా ఇతర పథకాలకు కూడా వాడుకోవద్దు. కానీ, ప్రభుత్వం ఈ ఫండ్స్​ ను విద్యుత్​ సంస్థలకు 50 నుంచి 70 శాతం వరకు మళ్లించింది. బకాయి బిల్లులు చెల్లించడమే కాకుండా.. ఏకంగా మూడు నెలలకు అడ్వాన్సులు చెల్లించింది. వాస్తవానికి ఇవన్నీ ప్రభుత్వం ఇచ్చే పల్లెప్రగతి నిధుల కింద చెల్లించాల్సి ఉంటోంది. కానీ, తెలంగాణ సర్కారు విద్యుత్​ సంస్థలకు బంపర్​ ఆఫర్​ ఇచ్చింది. ఏకంగా మూడు నెలలకు అడ్వాన్సుల కింద వారికి ఇచ్చింది. దీంతో విద్యుత్​ వినియోగించుకోకుండానే.. వేలకు వేలు సంస్థలకు ఇచ్చారు. ఇంకా కొన్ని నిధులు మిగిలి ఉండటంతో.. వాటిని ఇతర పథకాలకు వాడుకోవాలని భావిస్తోంది. ప్రస్తుతం ఆర్థిక సంఘం నిధులు వచ్చినా.. పంచాయతీ ఖాతాలు ఖాళీగా ఉన్నాయి.

ఇది సర్కారు దొంగతనం: బింగి, కరుణాకర్​, సర్పంచ్​, రంగాపూర్​, కరీంనగర్

15వ ఆర్థిక సంఘం నిధులు కేంద్రం నుంచి వచ్చీరాగానే రాష్ట్ర ప్రభుత్వం తీసేసుకుంది. వాస్తవంగా వీటిని సర్పంచ్, ఉప సర్పంచ్​సంతకాలతో డ్రా చేసుకోవాలి. పంచాయతీ ప్రత్యేక ఖాతాకు సంబంధించిన డిజిటల్​కీలను తీసుకుని, వాటితో ఈ నిధులు మళ్లించుకున్నారు. కనీసం సర్పంచ్‌కు కూడా సమాచారం లేదు. అధికారులను అడిగితే కూడా చెప్పడం లేదు. ఇది కచ్చితంగా ప్రభుత్వం చేసిన దొంగతనమే.

ఇలా వచ్చి.. అలా పోయాయి: వీరమల్ల రవీందర్​ రెడ్డి, సర్పంచ్, గుండ్లపల్లి, సైదాపూర్ మండలం

గ్రామ పంచాయతీల్లో చాలా కష్టాలున్నాయి. కనీసం మంచినీళ్లు కొని పెట్టేందుకు కూడా రూపాయి లేదు. లక్షలకు లక్షలు బిల్లులు రావాల్సి ఉంది. 15వ ఆర్థిక సంఘం నిధుల కోసం ఎదురుచూస్తున్నాం. ఇప్పుడు అవి మా ఖాతాల్లో పడగానే.. కేవలం గంటలోనే మాయం అయ్యాయి. ఎందుకు.. ఎవరు తీసుకున్నారో తెలియలేదు. రెండు రోజుల తర్వాత అధికారులను అడిగితే చావు కబురు చల్లగా చెప్పినట్లు చెప్పారు. మా ఖాతాల నుంచి మాకు తెలియకుండా ఎలా తీసుకుంటారు.. ప్రభుత్వంపై దొంగతనం కేసు పెట్టాలి.

Also Read...

గురుకులాలతోనే సరి.. ఆ విషయంలో తెలంగాణ సర్కార్ అట్టర్ ఫ్లాప్..!



Next Story

Most Viewed